మేమిద్దరం హై టెన్షన్ వైరులా కొట్లాడతాం: రేవంత్ రెడ్డి
ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా..
కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా షాక్ ఇస్తాం..
సీతక్క తనతో సరిసమానం
ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతా
తెలంగాణ తల్లి సోనియాగాంధే
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తనతో సరిసమానమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం టీపీసీసీగా ఎన్నికైన రేవంత్రెడ్డితో మంగళవారం సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కాతమ్ముడు మాదిరిగా ప్రేమగా పలకరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్కపై.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సీతక్క తనకు అండగా వుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధేనని స్పష్టం చేశారు.

‘‘ నాకు పీసీసీ పదవీ వస్తదని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే.. ప్రగతి భవన్ తలుపులు తెరిచారు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడతాం. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే లక్షల్లో వసూలు చేస్తున్నారు. టీఆరెస్ జెండా మోసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సంతోషంగా ఉన్నారా?. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. దిక్కులేక స్థానిక ప్రజాప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారు. లోకల్ లీడర్లు రోడ్లపై పడ్డారు. టీఆరెస్ స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు. టీఆరెస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయింది.’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
