మరో ఎర్రవెల్లిలా…. వాసాలమర్రి
వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే: సీఎం కేసీఆర్..
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి: ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రికి కేసీఆర్ వరాలు కురిపించారు. ఆ గ్రామానికే కాకుండా.. జిల్లాలోని మిగతా గ్రామాలకు కూడా నిధులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 421 గ్రామాలుండగా.. ఒక్కొక్క గ్రామానికి 25 లక్షల రూపాయల నిధులిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మున్సిపాలిటిలకు కూడా నిధులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు మున్సిపాలిటీలుండగా.. భువనగిరి మున్సిపాలిటికి కోటి రూపాయలు.. మిగతా మున్సిపాలిటీలైన యాదగిరి గుట్ట, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్ పోచంపల్లిలకు 50 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదలచేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్దికోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఆయన.. గ్రామస్తులందరూ కలిసి ఉండాలని కోరారు. గ్రామంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా నేనున్నానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామం కోసం గ్రామ నిధి ఏర్పాటు చేయాలన్నారు. వాసాలమర్రి కూడా ఎర్రవెల్లిలా అభివృద్ది చెందాలని ఆయన అన్నారు. వాసాలమర్రిలో మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని అన్నారు. గ్రామంలో 2000 మంది గ్రామం కోసం 5 గంటలు పనిచేస్తే ఊరు మారదా అని ఆయన ప్రశ్నించారు. తాను మొండొడినని.. తనతో పెట్టుకోవద్దని ఆయన అన్నారు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో వదిలేయనని ఆయన అన్నారు.
బంగారు వాసాలమర్రిని చేస్తా… : సీఎం కేసీఆర్..
యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిని ఓ స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని, వాసాల మర్రిని బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. సీటీ కొట్టడానికి తానేమీ సినిమా యాక్టర్ ను కానని , చప్పట్లు కొట్టుడు కాదు పని చేయాలని అన్నారు. వాసాలమర్రికి ఇంకో 20సార్లు వస్తానని ఆయన చెప్పారు. గొర్రెలు, బర్రెలు, ట్రాక్టర్లు ఇవ్వడానికి తాను ఇక్కడి వరకు రానవసరంలేదని దానికి అధికారులు సరిపోతారని ఆయన అన్నారు. ఇంకా ఏదో ప్రత్యేకంగా చేయాలనే తాను వాసాలమర్రికి వచ్చానని చెప్పారు.
వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే: సీఎం కేసీఆర్..
వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి సంబంధించి ప్రణాళికపై సీఎం కేసీఆర్ ప్రజలకు వివరించారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరూ పిడికిలి బిగించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామంలోని మూడు దళిత వాడలున్నాయని వాటి పరిస్థితిపై అధికారులు తనకు రిపోర్ట్ ఇస్తారని తెలిపారు. గ్రామంలో ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించుకోవాలని అన్నారు. అన్ని కులాలు జనాభా ఆధారంగా డైరెక్టర్లను ఎన్నుకుని గ్రామ అభివృద్ధి కమిటీని నియమించుకోవాలన్నారు. వారానికి రెండు గంటలు గ్రామ అభివృద్ధికి శ్రమించాలని,గ్రామ శ్రమదానం, పచ్చదనం, పరిశుభ్రత, వ్యవసాయానికి విడివిడిగా కమిటీలు వేసుకోవాలన్నారు.
