పంజాబ్ లో పరాభవం.. పాతాళంలోకి హస్తం
హైదారాబాద్, టీఎస్ డ్రీమ్స్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. మిగిలిన ఐదు రాష్ట్రాల విషయాన్ని పక్కనపెడితే.. సొంత పాలనలో ఉన్న పంజాబ్లో సైతం ఆ పార్టీకి ఘోర పరాభవంతో హస్తం పార్టీని పాతాళానికి తొక్కిండ్రు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోగా.. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓటమిపాలయ్యారు. ఇంతటి అగ్ర నేతలు సైతం ఒడిపోవడంపై హస్తం పార్టీలో సైతం నోటా మాట రావడం లేదట.

తాము గెంటేసిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఓటమిపాలయ్యారు. దీంతో తాము ఓడిన సరే.. అమరీందర్ సింగ్ ఓటమితో కొందరు సంబురపడ్డారట.. మొత్తంగా కాంగ్రెస్కు చెందిన హేమాహేమీలను పంజాబీలు మట్టి కరిపించారు. ఇక యూపీలో స్వయంగా ప్రియాంకా గాంధీ ప్రచారం చేసినా.. రాహుల్, సోనియా గాంధీల నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
అన్నింటా ఓటమి నేపథ్యంలో… ఈ ఓటమికి బాధ్యులు ఎవరు అంటూ పార్టీ సీనియర్లు కాస్తంత గట్టిగానే గళం విప్పారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ చాల సీరియస్ గా ఉన్నారట. దీంతో అత్యవసరంగా ఖచ్ఛితంగా సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరగనుందని.. ఏఐసీసీ నుంచి శనివారం ఓ ప్రకటన వచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఓటమికి గల కారణాలపై పార్టీ చర్చించనుంది.
